EPDC News India
EPDC News Logo

Environment Protection Development Council-EPDC

కరువు ప్రాంతం యర్రగొండపాలెంలో... దిగజారి పోతున్న భూగర్భ జలాలు

Image

ఎండుతున్న పంట తోటలు రైతుకు దక్కని మద్దతు ధర వెలుగొండ ప్రాజెక్టు కోసం రైతుల ఎదురు చూపులు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ . యర్రగొండపాలెం, ఏప్రిల్ 11 (దక్షిణాది న్యూస్): యర్రగొండపాలెం ప్రాంతంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయని, పచ్చని పంట తోటలు ఎండిపోతున్నాయని, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితేనే ఈ ప్రాంత రైతులకు భవిష్యత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం యర్రగొండపాలెం మండలంలోని వీరాయిపాలెం, సాయిబాబా నగర్ తదితర గ్రామాల్లో పర్యటించి రైతుల దుర్భర పరిస్థితిని స్వయంగా పరిశీలించింది. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ప్రతినిధి బృందం, వారు పండిస్తున్న పంటలు, పాతాళానికి చేరుకున్న భూగర్భ జలాలు, వాటిని పంటలకు అందించేందుకు పడుతున్న కష్టాలు, ఒక్కో రైతు తవ్వించిన బోర్లు, పనిచేస్తున్న వాటి సంఖ్య వంటి వివరాలను అడిగి తెలుసుకుంది. అనంతరం కెవిపి ప్రసాద్ మాట్లాడుతూ... ఈ ప్రాంతంలో కరువు పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ నిమ్మ, బొప్పాయి, బత్తాయి, అరటి, దానిమ్మ వంటి లాభదాయకమైన పంటలు సాగు చేసేవారని గుర్తు చేశారు. కొందరు రైతులు ఈ కరువును తట్టుకోవడానికి పదుల సంఖ్యలో బోరుబావులు తవ్వించినా ఫలితం లేదని వాపోయారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ భూములను అమ్ముకుని ఇక్కడ భూములు కొని సాగు చేస్తున్న రైతులు సైతం తీవ్ర నిరాశలో ఉన్నారని, కొందరు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో రైతులు మొదట్లో బోర్లు వేసినప్పుడు 200 అడుగుల్లో నీరు పడేదని, కానీ ఇప్పుడు 1000 నుంచి 1200 అడుగులు తవ్వినా నీరు కనిపించడం లేదని కెవిపి ప్రసాద్ తెలిపారు. ఒక్కో రైతు ఐదు నుంచి పది బోర్లు వరకు తవ్వించారని, ప్రతి సంవత్సరం వేసవి వస్తే ఈ ప్రాంత రైతులకు అది ఒక నరకంగా మారుతోందని ఆయన అన్నారు. సమీప గ్రామాల నుంచి కిలోమీటర్ల మేర పైపులు వేసుకొని నీరు కొనుక్కొని మొక్కలను బతికించుకుంటున్నారని ఆయన దుస్థితిని వివరించారు. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోవడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. ఒకవేళ ప్రకటించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పంట వేసినా సరైన మద్దతు ధర లేక రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మందు కొట్టడానికి, కూలీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కౌలు రైతులకు పరిస్థితి మరింత దయనీయంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులకు నీటి రవాణా ఖర్చులను భరించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో పండించిన పంటలను సుదూర ప్రాంతాలకు తరలించడానికి రవాణా ఖర్చుల్లో ప్రభుత్వం సగభాగం భరించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలో అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంత రైతులు వేసిన పంటలు బతకాలంటే పులసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాల్సిందేనని కెవిపి ప్రసాద్ స్పష్టం చేశారు. 1996లో చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేస్తూ, గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు ఏ మాత్రం ముందుకు సాగలేదని విమర్శించారు. ఇప్పటికీ నామమాత్రంగా నిధులు ఇస్తే ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఇటీవల మార్కాపురం వచ్చిన సందర్భంగా ఈ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంకా ఎంతకాలం వేచి ఉండాలని ఆయన నిలదీశారు. ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడానికి తక్షణమే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి సాగు మరియు త్రాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు టీసీఎచ్ చెన్నయ్య, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు బాణాల రామయ్య, మన్నె సాంబశివరావు, సీపీఐ మండల కార్యదర్శి నక్కా తిరుపతయ్య, రైతులు అంగిరేకుల చంద్రశేఖర్, అంగిరేకుల వెంకటరావు, మువ్వ చక్రవర్తి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.